హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీఎస్ బీపాస్ నేటి నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో టీఎస్ బీపాస్ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని మూడు నెలల క్రితం అమల్లోకి తీసుకువచ్చింది. నిర్మాణాల అనుమతులు పొందడానికి టీఎస్ బీపాస్ వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీసేవా, టీఎస్ బీపాస్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో టీఎస్ బీపాస్ విధానం అమలవుతున్నది.
గతేడాది నవబర్ 16న మంత్రి కేటీఆర్ టీఎస్ బీపాస్ వెబ్సైట్ను ప్రారంభించారు. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్సైట్ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలను జారీచేయనున్నారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. 600 గజాల లోపు ఇండ్లకు, 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు. ఈ భవనాల నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు జారీచేస్తారు. ఈ వెబ్సైట్ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.