న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్ పండుగ అమ్మకాలు ఈసారి పెద్ద ఎత్తున జరిగాయి. గత నెల 15 నుంచి ఈ నెల 15 వరకు ఆన్లైన్ సంస్థల స్థూల విక్రయాలు దాదాపు రూ.58వేల కోట్లు (8.3 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయని రిసెర్చ్ సంస్థ రెడ్సీర్ శుక్రవారం తెలిపింది. నిజానికి పండుగ సీజన్కు ముందు 7 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని రెడ్సీర్ అంచనా వేసింది. ఇక గతేడాది ఇదే వ్యవధిలో ఆన్లైన్ షాపింగ్ రూ.35వేల కోట్లుగానే ఉందని పేర్కొన్నది. దీంతో ఈ ఏడాది 65 శాతం అమ్మకాలు పుంజుకున్నైట్లెంది. ‘ది ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్స్' పేరుతో రెడ్సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ ఏడాది సెప్టెంబర్లో రూ.22వేల కోట్ల విక్రయాలు జరిగినట్లు వెల్లడించింది. పండుగ సీజన్లో సేల్స్ రెట్టింపునకుపైగా ఎగబాకాయని తెలిపింది. ‘కరోనా ప్రభావం ఉన్నా ఈసారి అమ్మకాలు నిరుడు కంటే, ముఖ్యంగా అంచనాలకు మించి నమోదు కావడం గమనార్హం’ అని ఈ సందర్భంగా రెడ్సీర్ డైరెక్టర్ మ్రిగ్నక్ గుట్గుటియా అన్నారు. కాగా, దసరా, దీపావళి సందర్భంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర ఈ-కామర్స్ సంస్థలు మెగా సేల్స్ను నిర్వహించిన విషయం తెలిసిందే.