టోక్యో, నవంబర్ 27: భూమి నుంచి సుమారు 30 కోట్ల కిలోమీటర్ల దూరంలోని ర్యుగు గ్రహశకలం నుంచి మట్టిని సేకరించిన జపాన్ వ్యోమనౌక హయబుస-2 త్వరలో భూమికి చేరుకోనుంది. ఏడాది కిందట ర్యుగు ఆస్టరాయిడ్ నుంచి బయలుదేరిన ఈ వ్యోమనౌక.. మట్టిని భద్రపరిచిన క్యాప్సూల్ను డిసెంబర్ 6న దక్షిణ ఆస్ట్రేలియాలో జారవిడువనుంది. ఈ మట్టి నమూనాల ద్వారా భూమిపై జీవం పుట్టుకకు సంబంధించిన కీలక సమాచారం తెలుసుకునే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హయబుస ప్రాజెక్ట్ డైరెక్టర్ మకోటో యోషికవా స్పందిస్తూ.. ‘మట్టిని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భూమిపై జీవం పుట్టుకకు ఆర్గానిక్ మెటీరియల్స్ మూలం. అయితే అవి ఎక్కడి నుంచో వచ్చాయో ఇప్పటికీ తెలియదు. ఈ నమూనాల ద్వారా దానికి సమాధానం లభిస్తుందని మేం భావిస్తున్నాం’ అని తెలిపారు.